టోర్నీల్లో ఆడుతూ.. ఇద్దరం కలిసి
2007 నుంచి ఈ బ్యాడ్మింటన్ జోడీ ప్రేమలో ఉన్నట్లు గత నెల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘బ్యాడ్మింటన్లో మా ప్రయాణం 2007-08లో మొదలైంది. అప్పటి నుంచి పెద్ద టోర్నీల్లో ఆడుతూ.. ఇద్దరం కలిసి శిక్షణ తీసుకునేవాళ్లం. అలా ఒకరి ఆట గురించి మరొకరు సలహాలు, సూచనలు చేసుకుంటూ స్నేహితులమయ్యాం. ఈ పోటీ ప్రపంచంలో అలా ఒకరికి క్లోజ్ కావడం చాలా కష్టం. కానీ.. మేము చాలా సులువుగా కలిసిపోయాం.
పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు
అలా.. మాతో పాటు సుదీర్ఘకాలంగా మా బంధం కూడా కొనసాగుతూ వచ్చింది. అయితే.. మేము ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. ఒకవేళ అలా ఆలోచిస్తే.. మా గేమ్ ఫోకస్ దెబ్బతింటుందని ఆందోళనచెందాం. ఇంట్లో అయితే.. నేను అడగకుండానే అన్నీ నాకు సమకూరుస్తారు. కానీ.. పెళ్లి అయితే.. నాకంటూ కొన్ని బాధ్యతలు వస్తాయి. కామన్వెల్త్, ఆసియా గేమ్స్కి ముందు ఆ బాధ్యతలు తీసుకోవాలని నేను అనుకోలేదు.
డిసెంబరు 16వ తేదీ మాత్రమే షెడ్యూల్లో
అయితే.. ఇప్పుడు ఆ టోర్నీలు ముగిశాయి. అందుకే.. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. డిసెంబరు 20 నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్.. ఆ తర్వాత టోక్యో గేమ్స్ క్వాలిఫయర్స్ మొదలవుతాయి. ఈ నేపథ్యంలో.. డిసెంబరు 16వ తేదీ మాత్రమే నా షెడ్యూల్లో పెళ్లికి తేదీ ఖాళీగా ఉంది'అని సైనా నెహ్వాల్ వెల్లడించింది.
ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన ప్లేయర్ సైనా
సైనా జీవితం ఆధారంగా ‘సైనా' అనే సినిమా రాబోతోంది. సైనా పాత్రలో బాలీవుడ్ నటి శ్రధ్ధా కపూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన ఏకైక భారత మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా. 2015లో ఈ ఘనత సాధించింది. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు సైనా బయోపిక్లో చూపించనున్నారు. సైనా కామన్వెల్త్ గేమ్స్లో రెండు బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా నిలిచిన సంగతి తెలిసిందే.