
హైదరాబాద్: బ్యాడ్మింటన్కు సంబంధించి గత మూడ్రోజులుగా విమర్శలు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) వైఖరి వివాదాస్పదమైంది. ఇటీవల అసోంలో జరిగిన జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో అండర్-19 సింగిల్స్ విజేతలకు కారును బహుమతిగా ఇచ్చారు. డబుల్స్ టైటిళ్లు గెలిచిన క్రీడాకారులు ఒక్కొక్కరికి రూ.26 వేల చొప్పున (ఉమ్మడిగా రూ.52 వేలు) నగదు బహుకరించారు.
ఈ విషయంపై వివాదం చెలరేగింది. డబుల్స్ క్రీడాకారులపై ఈ వివక్ష ఎన్నాళ్లంటూ సీనియర్ క్రీడాకారిణులు అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, ప్రణవ్ చోప్రా తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ బ్యాడ్మింటన్లో డబుల్స్ క్రీడాకారుల పట్ల ఇలాంటి వివక్ష ఎప్పటినుంచో చూపిస్తున్నారు. అశ్విన తన కెరీర్లోనూ ఇలాంటివి ఎదుర్కొన్నానంది.
'సీనియర్లుగా తాము ఎదుర్కొంటున్న వివక్షనే జూనియర్లూ ఎదుర్కోవాలా, దీన్ని ఆపండి'అని సిక్కిరెడ్డి ట్వీట్ చేసింది. సింగిల్స్, డబుల్స్ అని చూడకుండా టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన షట్లర్కు ఒకే బహుమతి ఇచ్చేలా బాయ్ చూడాల్సిందని ప్రణవ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
నేను గొంతెత్తి అరిస్తే వినపడలేదా.. జ్వాలా:
భారత బ్యాడ్మింటన్లో డబుల్స్ క్రీడాకారులపై వివక్ష గురించి తాను క్రీడాకారిణిగా ఉన్నపుడు ఎన్నోసార్లు గొంతెత్తానన్నారు. అప్పుడు ఒక్కరు కూడా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం అందరూ ఒకేసారి ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ గుత్తా జ్వాల వ్యాఖ్యానించింది.
'వివక్ష గురించి నేను మాట్లాడినపుడు వీళ్లందరూ ఏమయ్యారు. నేనిప్పుడు ఆడట్లేదు కాబట్టి వాళ్లకిప్పుడు న్యాయం జరగాలని కోరుకుంటున్నారా? ద్వంద్వ ప్రమాణాలంటే ఇవే'అని జ్వాలా అంది. భారత బ్యాడ్మింటన్కు సంబంధించి ప్రతి విజయం తాలూకు ఘనత ఒక వ్యక్తికే వెళ్తుందని, కానీ నిందలు మాత్రమే భారత బ్యాడ్మింటన్ సంఘం మీదే పడతాయని జ్వాలా అభిప్రాయపడింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.