హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ ప్లేయర్స్ సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డిల వివాహం హైదరాబాద్లో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు ఇరు కుటుంబ సభ్యుల పెద్దలను ఒప్పించి వివాహబంధంతో ఒక్కటయ్యారు. శంషాబాద్ సమీపంలోని మల్లిక కన్వెన్షన్ హాల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ISSF World Cup: 10మీ ఎయిర్రైఫిల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన చండేలా
ఈ వివాహానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, కోచ్ పుల్లెల గోపీచంద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పీవీ సింధులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. కోదాడలో జన్మించిన సిక్కీ రెడ్డి భారత బ్యాడ్మింటన్లో డబుల్స్ క్రీడాకారిణిగా కొనసాగుతోంది.
ఈ ఏడాది ఏప్రిల్లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సిక్కీ రెడ్డి సభ్యురాలిగా ఉంది. ఇక, మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్పతో కలిసి కాంస్య పతకం కూడా సాధించింది.