హైదరాబాద్: నాగ్పూర్ వేదికగా జరిగిన జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్లో పీవీ సింధుపై సైనా నెహ్వాల్ విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో పీవీ సింధుపై సైనా నెహ్వాల్ పైచేయి సాధించింది.
ఇద్దరి మధ్య పోరు చూస్తుంటే తలపడుతున్నది సూపర్ సిరిస్ మాదిరి అనిపించింది. నువ్వా నేనా అన్నట్టు జరిగి మ్యాచ్లో చివరకు సైనానే విజయం వరించింది. హోరా హోరీగా సాగిన ఫైనల్లో పీవీ సింధుపై 21-17, 27-25 తేడాతో సైనా విజయం సాధించింది.

తొలిగేమ్ను సైనా సులభంగా గెలవగా... రెండో గేమ్ మాత్రం ఉత్కంఠగా సాగింది. సింధు 5-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ 14-10తో దూసుకెళ్లింది. గేమ్ 17-14తో ఉన్న దశలో సైనా అనూహ్యంగా పుంజుకుని 18-18తో స్కోర్ సమం చేసింది.
ఈ సమయంలో ఇద్దరూ చెరో పాయింట్ సాధించడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. అంతేకాదు ఆట కూడా రసవత్తరంగా మారింది. సుదీర్ఘంగా ర్యాలీలు ఆడటంతో 20-20, 22-22, 24-24, 25-25తో గేమ్ కొనసాగింది. చివరికి అలసిపోయిన సింధు షటిల్ను రెండు సార్లు నెట్కు కొట్టడంతో సైనా విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ విజేతలకు పతకాలు అందజేశారు. ఇదిలా ఉంటే పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో కిదాంబి శ్రీకాంత్పై ప్రణయ్ ఘన విజయం సాధించాడు.