
హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు గురువారం సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ను కలిశారు. చెన్నైలోని మక్కల్ నీధి మయ్యమ్(MNM) పార్టీ కార్యాలయంలో కమల్ హాసన్ను పీవీ సింధు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమల్ హాసన్తో కలిసి పీవీ సింధు లంచ్ చేశారు.
అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణం అందించడమే తన లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం తాను ఎంతో కష్టపడుతున్నట్లు చెప్పారు. టోక్యో ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి స్వర్ణం సాధిస్తానని అన్నారు. కమల్ హాసన్ సూపర్ స్టార్ అని, తన ఫేవరేట్ హీరోల్లో ఆయన కూడా ఒకరని చెప్పారు.
ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధును బుధవారం కేరళ ప్రభుత్వం సత్కరించిన సంగతి తెలిసిందే. కేరళ ఒలింపిక్ సంఘం ఆమెకు రూ.10 లక్షల నగదు బహుమతిని అందించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరై విజయన్ మాట్లాడుతూ సింధు దేశానికి గర్వకారణమని అన్నారు.
పీవీ సింధు కేరళ పర్యటనలో భాగంగా అనంత పద్మనాభస్వామి, అట్టుక్కల్ భగవతి ఆలయాలను సందర్శించింది. ఈ సందర్భంగా ఆమె కేరళ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఈ పర్యటనలో ఆమెతో పాటు తల్లి విజయ కూడా ఉన్నారు. సింధు కేరళకు రావడం ఇది రెండోసారి. 2016 ఒలింపిక్స్లో రజతం గెలిచిన తర్వాత తొలిసారి కేరళకు వెళ్లారు.