
హైదరాబాద్: తన పాస్ పోర్ట్ పోయిందని, ఈ విషయంలో తనకు సాయం చేయాలని భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ ట్విట్టర్లో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను ట్విట్టర్లో కోరాడు. వివరాల్లోకి వెళితే డెన్మార్క్ ఓపెన్లో భాగంగా పారుపల్లి కశ్యప్ ప్రస్తుతం నెదర్లాండ్స్లో ఉన్నాడు.
ఈ క్రమంలో శనివారం తన పాస్ పోర్ట్ పోయిన విషయాన్ని ట్వీటర్ ద్వారా తెలియజేశాడు. తన పాస్పోర్ట్ను తిరిగి పునరుద్దరించేందుకు ఏర్పాటు చేయాలని ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు ట్విట్టర్లో విన్నవించాడు.
కశ్యప్ తన ట్విట్టర్లో "నా పాస్ట్పోర్ట్ పోయింది. గత రాత్రి ఆమెస్టర్డామ్లో నా పాస్పోర్ట్ను పోగుట్టుకున్నాను. నేను ఇప్పుడు డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ జర్మనీ ఓపెన్, సార్లౌక్స్ ఓపెన్లో పాల్గొనడానికి పయనం కావాల్సి ఉంది. డెన్మార్క్కు వెళ్లడానికి ఆదివారం నాటికి టికెట్ తీసుకున్నాను. అదే సమయంలో నా పాస్పోర్ట్ పోయింది. ఈ విషయంలో సుష్మా జీ సాయం చేయండి. ఈ వ్యవహారంలో త్వరతగతిన సాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను" అని తన ట్వీట్లో పేర్కొన్నాడు.
అదే సమయంలో తన ట్వీట్ను కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్కు, ప్రధాని నరేంద్ర మోడీలకు సైతం ట్యాగ్ చేశాడు.