
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో గత కొన్నేళ్లుగా అద్భుత ప్రదర్శన చేస్తోన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి పేరును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) 'అర్జున అవార్డు'కు సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిక్కి రెడ్డి పేరును 'బాయ్' అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ సిఫారసు చేశారు.
ఇటీవలే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న సిక్కి రెడ్డి, మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్పతో కలిసి కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.
మరోవైపు కామన్వెల్త్ క్రీడలలో అథ్లెటిక్స్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పేరును అత్యున్నత క్రీడాపురస్కారం ఖేల్రత్నకు భారత అథ్లెటిక్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రతిపాదించింది. 2016లో జరిగిన జూనియర్ అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన నీరజ్... ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లోనూ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
నీరజ్తో పాటు నాలుగుసార్లు కామన్వెల్త్ క్రీడల పతక విజేత, డిస్కస్ త్రోయర్ సీమా పునియా, జావెలిన్ త్రోయర్ అన్నురాణి పేరును అర్జున అవార్డుకు సిఫారసు చేసినట్లు ఏఎఫ్ఐ తెలిపింది. 2014లోనే సీమాన పునియా పేరును అర్జునకు సిఫారసు చేసినా అప్పట్లో డోపింగ్ ఆరోపణలతో ఆమె పేరును అర్జున అవార్డుల కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని ఏఎఫ్ఐ అర్జున అవార్డు కమిటీ చైర్మన్ బహదూర్ సింగ్ చెప్పారు.
వరసగా నాలుగు కామన్వెల్త్ క్రీడలలో స్వర్ణ పతకాలతోపాటు 2014 ఆసియా క్రీడలలోనూ స్వర్ణం సాధించిన సీమా భారత అత్యుత్త అథ్లెట్ అని ఆయన కొనియాడారు. ఇక లెజెండరీ అథ్లెట్, భారత యూత్ జట్టు కోచ్ పీటీ ఉష, సంజయ్ గార్నిక్, బాబీ అలోసిస్, కుల్దీప్ సింగ్, జటా శంకర్ల పేర్లను ద్రోణాచార్య పురస్కారానికి, టీపీ ఊసెఫ్ను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఏఎఫ్ఐ ప్రతిపాదించింది.