హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లోనూ భారత క్రీడాకారులు సైనా, సింధు, శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ వరుస గేమ్స్లో ప్రత్యర్థిని చిత్తు చేసి రెండో రౌండ్కు దూసుకుపోగా, పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్ ముందంజ వేశారు.
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-14, 21-19తో పాయ్ యు పో (చైనీస్ తైపీ)పై, సైనా 21-12, 21-9తో యో జియా మిన్ (సింగపూర్)పై అలవోకగా గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తదుపరి రౌండ్లో సైనా, ఫాంగ్జీ (చైనా)తో, సింధు, జియాగ్జిన్ (చైనా)తో తలపడతారు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 13-21, 21-16, 21-16తో కెంటా నిషిమోటో (జపాన్)పై, సాయిప్రణీత్ 21-13, 11-21, 21-19తో అవింగ్సనోన్ (థాయ్లాండ్)పై, ప్రణయ్ 21-15, 19-21, 21-19తో కాంతాఫోన్ (థాయ్లాండ్)పై కష్టపడి నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరారు.
మరో మ్యాచ్లో సాయిప్రణీత్ గెలువగా, సమీర్ వర్మ 21-23, 17-21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్లో అర్జున్- రామచంద్ర, మహిళల డబుల్స్లో మేఘన- పూర్విష జోడీలు కూడా ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టాయి. మిక్స్డ్ డబుల్స్లో సౌరభ్ ,అనౌష్క..వెంకట్, జుహీ జోడీ తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలైంది.