హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు నిష్క్రమించింది. మహిళల సింగిల్స్లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్స్ ఫైనల్లో పీవీ సింధు చైనీస్ తైపీ క్రీడాకారిణి, ప్రపంచ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓటమి పాలైంది.
61 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సింధు అద్భుత ప్రదర్శన చేసింది. తొలి గేమ్ను 21-10తో సునాయాసంగా గెలిచిన సింధుకి రెండో గేమ్లో తై జు యింగ్ అనూహ్యా ప్రదర్శనతో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.

ఈ క్రమంలో ఈ గేమ్లో ఒకానొక దశలో సమానంగా నిలిచారు. 20-19తో ఆధిక్యాన్ని సంపాదించిన సింధు ఆ తర్వాత అనవసర తప్పిదాలతో మూడు వరుస పాయింట్లు కోల్పోయి చేజేతులా గేమ్ను చేజార్చుకుంది.
ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో తై జు యింగ్ చెలరేగింది. 21-16 పాయింట్ల తేడాతో మూడో గేమ్ని గెలుచుకోవడంతో పాటు మ్యాచ్ను కూడా సొంతం చేసుకుంది. దీంతో తై జు సెమీస్ అర్హత సాధించింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి సింధు ఇంటి దారి పట్టింది.
సైనా నెహ్వాల్ ఓటమి
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్లో సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. మహిళల సింగిల్స్లో భాగంగా క్వార్టర్స్లో జరిగిన మ్యాచ్లో సైనా నెహ్వాల్పై ఆరో సీడ్ సున్(చైనా) 21-17, 10-21, 21-17 తేడాతో విజయం సాధించింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమితో భారత మహిళల పోరు ముగిసింది. ఇక, పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ మాత్రమే భారత తరఫున ఆడుతున్నాడు. క్వార్టర్స్లో కిదాంబి మరో భారత ఆటగాడు సాయిప్రణీత్పై విజయం సాధించి సెమీస్కి దూసుకెళ్లాడు.