
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయిప్రణీత్, సమీర్ వర్మ, పారుపల్లి కశ్యప్ గురువారం జరిగిన మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యారు. మరోవైపు పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి కూడా ఓటమిపాలైంది. ఇప్పటికే మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్లో భారత జోడీలు వెనుదిరిగిన విషయం తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో మూడో సీడ్ సింధు 19-21, 18-21 స్కోరుతో వరుస గేముల్లో 29వ ర్యాంకర్ నిచాన్ జిందాపోల్ (థాయ్లాండ్) చేతిలో ఓడింది. 49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో కీలక సమయాల్లో తడబడిన సింధు మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్కు ముందు వీరిద్దరు ఆరు సార్లు తలపడగా.. సింధు ఐదింట్లో గెలవగా, జిందాపోల్ ఒకదాంట్లో నెగ్గింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్తో పాటు మరో నాలుగు టోర్నీల్లో పాల్గొన్న సింధు.. ఒక్కదాంట్లోనూ కనీసం ఫైనల్కు చేరలేదు. స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్లో మాత్రం సెమీస్ చేరింది.
పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సమీర్వర్మ 16-21, 21-7, 13-21తో వాంగ్ వీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడగా.. సాయిప్రణీత్ 23-25, 9-21తో ఆంథోని గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. అయితే కశ్య్ప్ ఒలింపిక్ మాజీ చాంపియన్ లిన్ డాన్కు చుక్కలు చూపించాడు. తొలి గేమ్లో గట్టి పోటీ ఇచ్చిన కశ్యప్.. రెండో గేమ్లో నెగ్గాడు. కీలక సమయంలో పుంజుకున్న లిన్ 21-17, 20-22, 21-14తో విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్ సాయిరాజు- చిరాగ్శెట్టి 19-21, 18-21తో లీ జున్హు- ల్యూ యుచెన్ (చైనా) చేతిలో ఓడింది.