జకార్తా: ఏషియాడ్లో భారత స్టార్ షట్లర్లు సైనా, సింధు ప్రదర్శన పట్ల భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ సంతోషం వ్యక్తం చేశారు. సైనా.. సింధుల మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన గోపీ చంద్.. సైనా మెరుగైన ఆట కనబర్చిందన్నారు. అంతేకాదు ఈ టోర్నీ అనంతరం జరిగే పోటీల్లో సింధు.. సైనాలు మరింత మెరుగ్గా రాణిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.
'సుదీర్ఘ కాలంగా బ్యాడ్మింటన్ ఆడుతున్న సైనా ఇప్పటికే ఒలింపిక్స్, వరల్డ్ కప్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్, ఏషియన్ ఛాంపియన్షిప్స్లలో పతకాలు సాధించింది. ఆసియా క్రీడల్లో మాత్రమే తను పతకం సాధించలేదు. ఆ లోటును సోమవారం ఆడిన గేమ్లో తీర్చుకుంది. ఆమె చూపించిన ఆటతీరు నన్ను సంతృప్తి పరచింద'ని కోచ్ గోపీచంద్ తెలిపారు. సింధు ప్రదర్శన పట్ల గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు.
'సింధు రెండో గేమ్లో ఓడినప్పటికీ.. ఏకాగ్రత కోల్పోలేదు. నిర్ణయాత్మక గేమ్లో తనెంతో బలంగా ఆడింది. వరల్డ్ నంబర్ 2ను ఓడించింది. రేపు ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 తై జు యింగ్తో పోరుకు సిద్ధంగా ఉండాలని' గోపీచంద్ సూచించారు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో తై జు యింగ్ చేతిలో 17-21, 14-21 తేడాతో సైనా నెహ్వల్ ఓడిపోయింది.
దీంతో కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది. ఆసియా గేమ్స్లో గత 36 ఏళ్లలో భారత్కు పతకం అందించిన షట్లర్గా సైనా అరుదైన ఘనత సాధించింది. మరో సెమీస్లో 21-17, 15-21, 21-10 తేడాతో యమగూచిపై విజయం సాధించిన సింధు ఫైనల్ చేరింది. తద్వారా ఆసియా కప్ ఫైనల్ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్గా సింధు రికార్డ్ క్రియేట్ చేసింది. చాలా టోర్నీల్లో ఫైనల్ వరకూ చేరి పరాభవానికి లోనయ్యే సింధు మంగళవారం జరగనున్న మ్యాచ్లో ఏం చేయనుందోనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.