జకార్తా: స్వర్ణం కోసం బ్యాడ్మింటన్ బరిలోకి దిగిన సైనా.. సింధూలు తీవ్రంగా శ్రమించి పతకాలనైతే నమోదు చేశారు. కానీ, స్వర్ణాలను దక్కించుకోలేకపోయారు. ఫైనల్లో గెలిచి తనకు ఫైనల్ ఫోబియా లేదని నిరూపించుకునేందుకు యత్నించిన సింధుకు విఫలయత్నమే వంతైంది. ఈ మాత్రం విజయమైన దక్కిందంటూ ప్రోత్సాహకంగా వారికి ప్రముఖులను ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలో సైనా నెహ్వాల్కు ఆమె తండ్రి చిరుకానుక అందజేశారు.
ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో కాంస్యం గెలిచిన సైనా నెహ్వాల్కు ఆమె తండ్రి హర్వీర్ సింగ్ చిరు కానుక అందజేశారు. ఈ విషయాన్ని సైనా తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అంతేకాదు ఆ కానుక ఏంటో కూడా చూపిస్తూ ఫొటోలు పెట్టింది.
ఇంతకీ ఆ కానుక ఏంటో తెలుసా బంగారు ఉంగరం. తెలుపు రంగు రాళ్లు పొదిగిన ఉంగరాన్ని ఎడమ చేతి మధ్య వేలికి తగిలించుకున్న సైనా ఇందుకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. 'జకార్తాలో జరిగిన ఆసియా క్రీడలు-2018లో కాంస్య పతకం గెలిచినందుకు నా తండ్రి హర్వీర్ సింగ్ నాకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్యూ' అని సైనా తన ట్విటర్లో పేర్కొంది.
మహిళల సింగిల్స్ సెమీస్లో ప్రపంచ నంబర్వన్ తై జు యింగ్ చేతిలో సైనా నెహ్వాల్ ఓడి కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. 'ఆసియా గేమ్స్లో బ్యాడ్మింటన్లో దేశానికి తొలి రజతం అందించిన సింధుకు అభినందనలు. మమ్ముల్ని గర్వపడేలా చేశావు. కాంస్యం నెగ్గిన సైనాకు కూడా అభినందనలు. దేశం తరఫున గొప్ప విజయం సాధించావు.' అంటూ ఎంపీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు.