
హైదరాబాద్: జకార్తా వేదికగా ఆగస్టులో ఆరంభం కానున్న ఆసియా గేమ్స్లో భారత షట్లర్లకు పెను సవాల్ ఎదురుకానుందా? అంటే అవుననే అంటున్న క్రీడావిశ్లేషకులు. ఆసియా ఉపఖండం నుంచే బ్యాడ్మింటన్లో ప్రపంచ చాంపియన్లు ఉండటంతో ఆసియా గేమ్స్లో భారత షట్లర్లు పతకం సాధించాలంటే చెమటోడ్చాల్సిందే.
ఈ క్రమంలో చైనా, జపాన్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్, చైనీస్తైపిల నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. టాప్-10 ర్యాంకర్లలో ఒకరిద్దరు పొరుగు దేశాల్లో ఉన్నప్పటికీ, మిగిలిన షట్లర్లందరూ ఆసియాకు చెందినవారే. ఆసియా గేమ్స్లో బాడ్మింటన్ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే భారత్ ట్రాక్ రికార్డు ఏమంత బాగాలేదు.
1951 ఆసియా క్రీడలు మొదలు 2014 ఇంచియాన్ వరకు బాడ్మింటన్లో సాధించిన పతకాల సంఖ్య కేవలం 8 మాత్రమే. అవికూడా కాంస్య పతకాలే. ఆసియా గేమ్స్లో బ్యాడ్మింటన్లో తొలి పతకాన్ని 1974లో టెహ్రాన్లో బోణీ కొట్టింది. డబుల్స్ విభాగంలో దేవేందర్ అహుజ, ప్రకాశ్ పదుకొణె జోడీ కాంస్య పతకాన్ని సాధించారు.
ఇదే ఆసియా గేమ్స్లో భారత్ సాధించిన తొలి పతకం. ఆ తర్వాత 1982లో భారత్ ఆసియా గేమ్స్కు ఆతిథ్యమివ్వడంతో మళ్లీ పతకాల వేట కొనసాగింది. డబుల్స్ విభాగంలో లారీ డిస, ప్రదీప్ గాంధి, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో లారి డిస, కన్వల్తాకర్ జోడి కాంస్య పతకాలు సాధించారు.
ఇక, టీమ్ విభాగంలో లారి డిస, ప్రదీప్ గాంధి, సయ్యద్ మోడీ పతకాలు సాధించగా... మహిళల టీమ్ విభాగంలో వందన, అమిత్, మధుమిత పతకాలు సాధించారు. ఇక సింగిల్స్లో సయ్యద్ మోడీ కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. దీంతో భారత్ ఆతిథ్యమిచ్చిన ఆసియా గేమ్స్లో ఐదు కాంస్య పతకాలు వచ్చాయి.
1986లో సియోల్లో జరిగిన ఆసియా క్రీడల్లో లారి డిస, విమల్ కుమార్, ప్రకాశ్ పదుకొణె టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. 2014 ఇంచియాన్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, అశ్వని పొన్నప్ప సైతం టీమ్ విభాగంలో కాంస్యంతో సరిపెట్టుకున్నారు.
ఆగస్టులో ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా ఆసియా గేమ్స్లో భారత షట్లర్లు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన ఇండోనేషియా, ఇండియా ఓపెన్, మలేసియా, చైనా, థాయిలాండ్, సింగపూర్ ఓపెన్ వరకు భారత షట్లర్లు ఆశించిన స్థాయిలో రాణించ లేకపోవడం అభిమానులను ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవలే గోల్ట్ కోస్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో టీమ్ విభాగంలో రాణించి స్వర్ణం చేజిక్కించుకున్నారు. ఇక, మహిళల సింగిల్స్ ఫైనల్లో సైనాతో సింధు తలపడి రజతం దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన ప్రతి టోర్నీలోనూ సింధు నాలుగు సార్లు ఫైనల్స్కు ఓడిపోయింది. ఈ నేపథ్యంలో జకార్తా ఆసియా గేమ్స్లో భారత షట్లర్ల ప్రదర్శన ఎలా ఉంటుందోనని ఆసక్తికరంగా మారింది.
ఆసియా గేమ్స్కు భారత జట్టు:
సైనా నెహ్వాల్, పీవీ సింధు, సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప, సాయి ఉత్తేజితారావు, అష్మిత, రుతుపర్ణ, ఆర్తి, ఆకర్షి, గాయత్రి, శ్రీకాంత్, ప్రణయ్, సాయి ప్రణీత్, సమీర్వర్మ, సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి, సుమీత్రెడ్డి, మను అత్రి, ప్రణవ్ చోప్రా, సౌరభ్వర్మ.
కోచ్లు: పుల్లెల గోపీచంద్, టాన్ కిమ్ హెర్, అరుణ్ విష్ణు, ఎడ్విన్
సహాయక సిబ్బంది: గాయత్రి శెట్టి, క్రిస్టోఫర్, కిరణ్, అరవింద్.