
హైదరాబాద్: ఆసియా గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించలేదని బాధగా లేదని తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో బాడ్మింటన్ ఫైనల్స్లోకి ప్రవేశించి సంచలనం సృష్టించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి రజత పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్స్లో ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ తై జు యింగ్పై 13-21, 16-21 తేడాతో పోరాడి ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ "ఓడిపోయే ఎన్నో మ్యాచుల్లో నేను పోరాడి గెలిచాను. కానీ ఈ పోటీ చాలా అద్భుతంగా ఉంది. గోల్డ్ మెడల్ గెలవలేదని నాకు బాధగా లేదు. మెడల్ పోడియంపై ఇద్దరు భారతీయులు ఉండటం ఎంతో గర్వంగా ఉంది" అని తెలిపింది.
మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్స్లో ఓటమిపాలై సింధు రజత పతకానికే పరిమితమైంది. ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ చేతిలో 13-21, 16-21 తేడాతో వరుస గేమ్స్లో ఓడినప్పటికీ చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో రజత పతకం సాధించిన తొలి భారతీయురాలిగా సింధు అరుదైన ఘనత సాధించింది.

ఫైనల్స్లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆట ప్రారంభం నుంచీ సింధు వెనుకంజలోనే ఉంది. తొలి గేమ్ 0-5తో వెనుకంజలో ఉన్న సింధు ఆ తర్వాత కాస్త పోరాడింది. కోర్టులో అత్యంత వేగంగా కదిలే తైజు కదలికలను సింధు అర్థం చేసుకోలేకపోయింది. డ్రాప్ షాట్లు, స్మాష్లు ఆడుతూ సింధును ఒత్తిడికి గురి చేసిన తైజు తొలి గేమ్ను కేవలం 16 నిమిషాల్లోనే ముగించింది.
ప్రత్యర్థి పదే పదే ఔట్ కొట్టడంతో వచ్చిన పాయింట్లు తప్ప సింధు సాధించిన పాయింట్లు తక్కువే అని చెప్పాలి. దీంతో సింధు 13-21తో తొలి సెట్ను కోల్పోయింది. రెండో గేమ్లోనూ మొదటి నుంచే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అక్కడక్కడా కొన్ని అద్భుతమైన షాట్లు ఆడినా.. ప్రత్యర్థిపై పూర్తిగా పైచేయి సాధించకపోయింది.
దీంతో రెండో గేమ్ను సింధు 16-21తో ఓడిపోయి మ్యాచ్ను చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ 13 సార్లు తలపడగా 10సార్లు తైజుదే పైచేయి కావడం విశేషం. ఆసియా గేమ్స్ సింగిల్స్ విభాగంలో ఓ భారత షట్లర్ ఫైనల్స్లోకి చేరుకోవడం ఇదే తొలిసారి. 1982 తర్వాత సింగిల్స్లో పతకాలు గెలవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు సైనా నెహ్వాల్ సెమీస్లోనే ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.