జకార్తా: ఆసియా క్రీడల్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్లో సెమీఫైనల్కి దూసుకెళ్లింది. భారత్కు మరో పతకాన్ని ఖాయం చేసింది. మహిళల సింగిల్స్లో భారత్ సాధించనున్న తొలి పతకం ఇదే కావడం విశేషం. 36 ఏళ్లుగా ఏషియన్ గేమ్స్ బ్యాడ్మింటన్లో భారత్కు సింగిల్స్ మెడల్ దక్కలేదు. అయితే ఆ కరువును ఒక్కరోజే ఇద్దరు హైదరాబాదీ ప్లేయర్స్ తీర్చారు. మొదట సైనా నెహ్వాల్ సెమీస్లో అడుగుపెట్టి కనీసం కాంస్య పతకం ఖాయం చేసింది. ఇప్పుడు పీవీ సింధు కూడా ఆమె బాటలోనే నడిచింది.
క్వార్టర్స్లో నాలుగో సీడ్ క్రీడాకారిణి, థాయ్లాండ్కు చెందిన రట్చనాక్పై 21-18, 21-16 తేడాతో వరుస గేమ్ల్లో సైనా గెలిచింది. మొదటి గేమ్లో ఇద్దరి మధ్య హోరాహోరీ నెలకొంది. 17-17, 18-18.. ఇలా నువ్వా నేనా అన్నట్లు పోరు సాగింది. అనంతరం సైనా పుంజుకుని తనదైన శైలిలో విజృంభించి తొలి గేమ్ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్లో తొలి నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించి 21-16తో గెలిచి సెమీస్లోకి అడుగుపెట్టింది.
క్వార్టర్ఫైనల్లో థాయ్లాండ్కే చెందిన జిందాపోల్పై 21-10, 16-21, 21-14 తేడాతో సింధు విజయం సాధించింది. అయితే సైనా అంత సులువుగా సింధు గెలవలేకపోయింది. మూడు గేమ్స్ పాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి గేమ్ను కేవలం 16 నిమిషాల్లోనే 21-10తో ముగించేసింది సింధు. అయితే రెండో గేమ్లో అనూహ్యంగా ప్రత్యర్థి నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది.
దీంతో 16-21 తేడాతో ఓడిపోయింది. ఇక నిర్ణాయాత్మక మూడో గేమ్ మొదట్లో తడబడినా.. తర్వాత పుంజుకుంది. ఒక దశలో 4-6 పాయింట్ల తేడాతో వెనుకబడినా.. తర్వాత ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరికి 21-14 తేడాతో గేమ్తోపాటు మ్యాచ్ను గెలిచింది. ఈ విజయంతో సెమీస్లో అడుగుపెట్టిన ఆమె.. ఇండియాకు మరో బ్యాడ్మింటన్ సింగిల్స్ మెడల్ ఖాయం చేసింది.