పారిస్ ఒలింపిక్స్ అనంతరం తొలిసారి బరిలోకి దిగిన టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు చుక్కెదురైంది. పునరాగమనంలో మొదటి మ్యాచ్లోనే ఓటమి పాలైంది. ఆర్క్టిక్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో కెనడా క్రీడాకారిణి మిచెల్లి లీ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 32వ ర్యాంకర్ మిచెల్లి లీ చేతిలో 16వ ర్యాంకర్ సింధు 16-21, 10-21 తేడాతో ఓడింది.
తొలి గేమ్లో పోటీ ఇచ్చిన ఓటమిపాలైన సింధు రెండో గేమ్లో పుంజుకుని సత్తాచాటుందనుకుంటే, ప్రత్యర్థి ముందు నిలవలేకపోయింది. తొలి గేమ్ కంటే పేలవమైన ప్రదర్శన చేసి మొత్తంగా 37 నిమిషాల్లో మ్యాచ్ను కోల్పోయింది. సింధు-మిచెల్లీ ఇప్పటివరకు ఓవరాల్గా 14 సార్లు తలపడ్డారు. అందులో సింధు పదిసార్లు విజయం సాధించగా, నాలుగు సార్లు ఓటమిపాలైంది.

మరోవైపు భారత యువ షట్లర్ మాళవిక బాన్సోద్ సంచలనం సృష్టించింది. ప్రపంచ నంబర్ 23 సంగ్ షూ యున్పై 21-19, 24-22తో గెలిచి ప్రిక్వార్టర్స్కు చేరుకుంది. ఆమెతో పాటు మరో రైజింగ్ స్టార్ ఆకర్షి కశ్యప్ కూడా ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. జర్మనీ క్రీడాకారిణి వొనె లిపై 21-19, 21-14తో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ క్వాలిఫికేషన్స్లో భారత ప్లేయర్ కిరణ్ జార్జ్ 21-16, 13-21, 21-19తో ఫ్రాన్స్ ప్లేయర్ కార్బౌట్పై నెగ్గి మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. ఈ టోర్నీలో లక్ష్యసేన్ అన్సీడెడ్గా బరిలోకి దిగుతున్నాడు. డెన్మార్క్ చెందిన రస్ముస్ గెమ్కేతో తలపడనున్నాడు.