హైదరాబాద్: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్ 1 ఆఫీసర్గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2016 రియో ఒలింపిక్స్లో పీవీ సింధు భారత్కు రజత పతకం అందించింది. ఈ నేపథ్యంలో పీవీ సింధుకు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో సీఎం చంద్రబాబు సింధుకు స్వయంగా ప్రభుత్వ ఉత్తర్వు కాపీని అందజేశారు. అనంతరం అపాయింట్మెంట్ లెటర్ అందజేస్తున్న ఫొటోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. భవిష్యత్తులో దేశానికి సింధు మరింత ఖ్యాతిని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్లో ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అనంతరం సింధు మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ కలెక్టర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి నియామక పత్రం అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన తొలి ప్రాధాన్యత బ్యాడ్మింటన్కేనని సింధు స్పష్టం చేసింది. క్రీడల్లో రాణించి మరిన్ని విజయాలు తెచ్చిపెట్టాలని సీఎం సూచించారని తెలిపారు.
మహిళలు క్రీడల్లో రాణించడం పట్ల చంద్రబాబు సంతోషంగా ఉన్నారని చెప్పింది. క్రీడాకారులకు సీఎం చంద్రబాబు చక్కటి ప్రోత్సాహం ఇస్తున్నారని తెలిపింది. 30 రోజుల్లోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగంతో పాటు సింధుకు రూ.3 కోట్ల నగదుతో పాటు రాజధాని అమరావతిలో వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే.