
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లకు కఠిన డ్రా ఎదురైంది. బర్మింగ్ హామ్ వేదికగా మార్చి 14 నుంచి 18 వరకు జరిగే ఈ టోర్నీలో టైటిల్ కోసం భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఈసారి మాత్రం అద్భుత ప్రదర్శన చేయాల్సిందే.
ఎందుకంటే తొలి మ్యాచ్లోనే సైనా నెహ్వాల్ వరల్డ్ నెంబర్ వన్తో పోటీ పడనుంది. తొలి మ్యాచ్లో సైనా నెహ్వాల్ డిఫెండింగ్ ఛాంపియన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)ను ఢీకొట్టనుంది. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ 11 ర్యాంకులో ఉన్న సైనా నెహ్వాల్, తైజుతో గత ఏడు మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా విజయం సాధించలేదు.
చివరిసారిగా వీరిద్దరూ ఇండోనేషియా ఓపెన్లో పోటీ పడ్డారు. 2015లో సైనా నెహ్వాల్ ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఫైనల్కు చేరింది. అదే సైనా అత్యుత్తమ ప్రదర్శన. మరోవైపు పీవీ సింధు తొలి మ్యాచ్లో సులభమైన ప్రత్యర్థితో తలపడనుంది. తొలి పోరులో నాలుగో సీడ్ పీవీ సింధు... పోర్న్పవి చోచువాంగ్ (థాయ్లాండ్)తో తలపడనుంది.
ఇక, రెండో రౌండ్లో ఇండియా ఓపెన్ విజేత బివెన్ జాంగ్ (చైనా)ను ఎదుర్కోవచ్చు. పురుషుల విభాగంలో మూడో సీడ్ కిదాంబి శ్రీకాంత్.. బ్రైస్ లెవెరెడ్జ్ (ఫ్రాన్స్)తో మ్యాచ్తో తలపడనున్నాడు. సాయి ప్రణీత్, హెచ్ ఎస్ ప్రణయ్ టోర్నీలో తదుపరి రౌండ్కు అర్హత సాధించాలంటే తమకంటే మెరుగైన ర్యాంకు క్రీడాకారులను ఓడించాల్సి ఉంది.