హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభానికి ముందే భారత్కు భారీ షాక్ తగిలింది. టోర్నీలో పోటీ పడాల్సిన భారత షట్లర్లలో ముగ్గురికి కరోనా సోకింది. అంతేకాదు సహాయ సిబ్బంది ఒకరు కూడా కరోనా బారినపడ్డారు. కరోనా సోకిన వారిని వెంటనే ఐసోలేషన్లోకి పంపారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారట. కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో.. భారత ఆటగాళ్లు ఎక్కువగా ప్రాక్టీస్ చెయ్యట్లేదు. ఈరోజు టోర్నీ ప్రారంభం కానుంది.
'ముగ్గురు భారత షట్లర్లకు, సహాయ సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. జురిచ్లో రెండు వారాల కింద స్విస్ ఓపెన్ ఆరంభమైనప్పటి నుంచి మేం ఐసోలేషన్లో ఉంటున్నాం. మా వాళ్లకు కరోనా ఎలా సోకిందో అర్థం కావట్లేదు. 14 రోజుల్లో మమ్మల్ని 5 సార్లు పరీక్షించారు. అన్నిసార్లూ నెగెటివ్ వచ్చింది. ఇప్పుడు కొద్ది మందికి పాజిటివ్ ఎలా వచ్చిందో తెలియట్లేదు' అని భారత జట్టు కోచ్ మథియాస్ బూ అన్నారు.
పాజిటివ్గా తేలిన భారత షట్లర్ల పేర్లు మాత్రం బయటకు రాలేదు. మరి కొందరు భారత షట్లర్ల ఫలితాల్లో స్పష్టత లేదు. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వంటి వారు తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. 'ఇవేం పరీక్షలు. అంతా అయోమయంగా, గందరగోళంగా ఉంది. మ్యాచ్లు బుధవారం ఆరంభమవుతున్నాయి. 30 గంటల ముందు నిర్వహించిన పరీక్ష ఫలితాలు ఇంకా రాలేదు. రెండు రోజులుగా ప్రాక్టీస్ లేదు. జిమ్ లేదు' అని సైనా ట్వీట్ చేశారు.
టోర్నీలో పీవీ సింధు, సైనా నెహ్వాల్ సహా చాలామంది భారత క్రీడాకారులు బరిలో ఉన్నారు. అయిదో సీడ్ సింధు తొలి రౌండ్లో సోనియా చియా (మలేసియా)ను ఢీకొనాల్సి ఉంది. ఏడో సీడ్ సైనా తొలి రౌండ్లో బ్లిచ్ఫెట్ (డెన్మార్క్) తలపడనుంది. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, కశ్యప్, సాయి ప్రణయ్, సమీర్ వర్మ బరిలోకి దిగుతున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి, మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్-అశ్విని, ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి, మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని పోటీ పడుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన జస్ప్రీత్ బుమ్రా వెడ్డింగ్ వీడియో!!