బర్మింగ్హామ్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ప్రపంచ చాంపియన్, మాజీ నంబర్వన్ పీవీ సింధు శుభారంభం చేసింది. కొన్నాళ్లుగా పేలవఫామ్తో తంటాలుపడుతున్న భారత స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్కు ఈ టోర్నీలోనూ నిరాశే ఎదురైంది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో తొలి రౌండ్లోనే ఓటమిపాలై టోక్యో ఒలింపిక్స్ బెర్త్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాడు.
'అగ్రస్థానంలో ఉన్న భారత్ను ఓడించాం.. మా విశ్వాసం రెట్టింపైంది'
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ సింధు 21-14, 21-17తేడాతో బివాన్ జెంగ్ (అమెరికా)ను వరుస గేమ్లలో ఓడించింది. 42 నిమిషాల పాటు మ్యాచ్ జరుగగా.. తొలి గేమ్లో కాసేపు హోరాహోరీ పోరు సాగింది. 8-9తో వెనుకబడిన సమయంలో ఒక్కసారిగా పుంజుకున్న సింధు.. వరుసగా ఐదుపాయింట్లు సాధించి తన ఆధిపత్యం కనబరిచింది. అదే ఆధిపత్యంతో గేమ్ సొంతం చేసుకుంది. రెండో గేమ్ సైతం ఉత్కంఠ భరితంగా సాగింది. జెంగ్ దూకుడుగా ఆడడంతో ఓ దశలో పాయింట్లు 16-16తో సమమయ్యాయి. ఈ సమయంలో వరుస పాయింట్లతో దుమ్ములేపిన తెలుగమ్మాయి విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 15-21, 16-21తో చైనాకు చెందిన మూడోసీడ్ చెన్ లోంగ్ చేతిలో పరాజయంపాలై టోర్నీ నుంచి వెనుదిరిగాడు. ప్రస్తుతం టోక్యో బెర్త్ రేసులో ఉన్న శ్రీకాంత్కు ప్రతి టోర్నీలోనూ రాణించడం కీలకం. కానీ.. ఇప్పుడిలా వరుస వైఫల్యాల నేపథ్యంలో అతను ఒలింపిక్స్కు అర్హత సాధించడంపై అనుమానాలు నెలకొన్నాయి.
మిక్స్డ్ డబుల్స్ పోటీలో సిక్కిరెడ్డి - ప్రణవ్చోప్రా జోడీ 13-21, 21-11, 17-21తేడాతో టాప్ సీడ్ చైనా ద్వయం షీ వీజెంగ్, క్వింగ్ హువాంగ్ చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్లో గాయం కారణంగా ప్రత్యర్థి ద్వయం తప్పుకోవడంతో సిక్కిరెడ్డి, అశ్వినీ జోడి ప్రి క్వార్టర్స్లోకి ప్రవేశించింది.