భారత బ్యాడ్మింటన్ యువ ప్లేయర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్షిప్లో సంచలనం సృష్టించాడు. సెమీఫైనల్లో మలేషియాకు చెందిన ప్రపంచ ఏడో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ లీ జి జియాను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టాడు. తద్వారా 123 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్లో 21 ఏళ్ల తర్వాత పురుషుల విభాగంలో ఫైనల్ చేరిన భారత ఆటగాడిగా 20 ఏళ్ల లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. మొత్తంగా ఈ టోర్నీలో ఫైనల్ చేరిన ఐదో భారత షట్లర్గా లక్ష్యసేన్ రికార్డు సృష్టించాడు. లక్ష్యసేన్ కంటే ముందు ప్రకాశ్ నాథ్, ప్రకాశ్ పదుకోన్, పుల్లెల గోపిచంద్, సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో ఫైనల్ చేరారు. కాగా వీరిలో ప్రకాశ్ పదుకోన్, పుల్లెల గోపిచందర్ టైటిల్ గెలవగా.. ప్రకాశ్ నాథ్, సైనా నెహ్వాల్ తుది మెట్టుపై బోల్తా పడ్డారు.
76 నిముషాలపాటు సాగిన సెమీఫైనల్ పోరులో 21-13, 12-21, 21-19 తేడాతో లీ జి జియాను లక్ష్యసేన్ ఓడించాడు. ఈ సెమీస్ పోరులో తొలి సెట్ను సునాయసంగా గెలిచిన లక్ష్యసేన్.. రెండో సెట్ను మాత్రం ప్రత్యర్థికి కోల్పోయాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో మాత్రం ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. మూడో సెట్లో లక్ష్యసేన్ ఒకానొక దశలో 10-14తో, 12-16తో, 16-18తో వెనుకబడ్డాడు. కానీ పట్టువిడవకుండా పోరాడిన లక్ష్యసేన్ చివర్లో పుంజుకున్నాడు. ఒక్క సారిగా 20-18తో అధిక్యంలోకి దూసుకెళ్లాడు. చివరికి సెట్ను 21-19తో కైవసం చేసుకుని, మ్యాచ్ను కూడా గెలుచుకున్నాడు. ఇక ప్రపంచ నంబర్వన్ అక్సెల్సన్ (డెన్మార్క్), నాలుగో ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఫైనల్ పోరులో లక్ష్య సేన్ హమీతుమీ తేల్చుకోనున్నాడు.
మహిళల డబుల్స్ విభాగంలో మాత్రం భారత్కు నిరాశ ఎదురైంది. భారత్కు చెందిన గాయత్రి గోపీచంద్-త్రిషా జాలీ జంట సెమీఫైనల్లో చైనాకు చెందిన జాంగ్ షు జియాన్-జెంగ్ యు జంట చేతిలో 17-21, 16-21 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే సెమీస్లో ఓడినప్పటికీ గాయత్రి-త్రిషా జోడీకి 14 వేల డాలర్ల (రూ. 10 లక్షల 64 వేలు) ప్రైజ్మనీ లభించనుంది.