
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో తెలుగు తేజం పీవీ సింధు అద్భుత ప్రదర్శన చేస్తోంది. శుక్రవారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మహిళల క్వార్టర్స్లో వరల్డ్ ఛాంపియన్, జపాన్ క్రీడాకారిణి ఒకుహరాపై 20-22, 21-18, 21-18 తేడాతో గెలిచి సెమీస్కు చేరుకుంది.
84 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సింధు తన జోరుని ప్రదర్శించింది. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో చెమటోడ్చి నెగ్గిన సింధుకు క్వార్టర్స్లోనూ హోరాహోరీ తప్పలేదు. ఆట ఆరంభం నుంచే ఒకుహరా దూకుడుగా ఆడుతూ సింధును ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేసింది. ఒకానొక దశలో తొలి సెట్లో ఇద్దరూ 20-20తో సమంగా నిలిచారు.
ఈ సమయంలో ఒకుహరా ఒక్కసారిగా రెచ్చిపోయి తొలిసెట్ను 20-22తేడాతో గెలుచుకుంది. ఇక రెండో గేమ్లో తొలి అర్థం భాగం వరకూ ఇరువురి మధ్య ఆసక్తికర పోరు సాగింది. సింధు దూకుడుగా ఆడుతూ క్రమంగా 11-9తేడాతో ఆధిక్యత సాధిస్తూ వచ్చింది. చివరికి రెండో సెట్ 21-18తేడాతో సింధు కైవసం చేసుకుంది.
దీంతో ఇద్దరూ చెరో సెట్ గెలుచుకున్నట్లయింది. ఇక, నిర్ణయాత్మక మూడో గేమ్లో మాత్రం ఒకుహరా నుంచి సింధుకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఆరంభం నుంచే నువ్వానేనా అన్నట్లు సాగుతూ వచ్చింది. రెండో సెట్ మాదిరిగానే ఒకుహరా బలమైన షాట్లతో రెచ్చిపోయి 13-16 ఆధిక్యంతో మ్యాచ్ను గెలిచే ప్రయత్నం చేసింది.
అంతేకాదు ఒకుహరా సుదీర్ఘ ర్యాలీలతో సింధును ఇబ్బంది పెట్టే యత్నం చేసింది. అయితే, సింధు తన అనుభవంతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-18తో మూడో సెట్ను కైవసం చేసుకుని సెమీస్లోకి అడుగుపెట్టింది. తద్వారా తొలిసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నీలో తొలిసారి సింధు సెమీస్లోకి ప్రవేశించి సరికొత్త చరిత్ర సృష్టించింది.