ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టింది. ఉమెన్స్ సింగిల్స్లో సింధు ప్రీక్వార్టర్స్కు దూసుకెళ్లింది. అయితే తొలి రౌండ్లో జర్మనీ ప్లేయర్ యెవన్నీ లీతో జరిగిన పోరు పూర్తిగా సాగలేదు.
తొలి గేమ్ గెలిచి సింధు ఆధిక్యంలో ఉన్నప్పుడు రెండో గేమ్ ఆడకుండానే లీ గాయంతో తప్పుకుంది. దీంతో సింధు రెండో రౌండ్కు సునాయాసంగా చేరుకుంది. తొలి గేమ్లో 21-10తో ప్రత్యర్థిపై సింధు విరుచుకుపడింది. తర్వాత పోరులో సింధు కొరియా క్రీడాకారిణి అన్ సి యంగ్తో తలపడనుంది.

మరోవైపు మంగళవారం జరిగిన సింగిల్స్లో సింధు మినహా మిగిలిన షట్లర్లందరూ ఓటిమిపాలయ్యారు. మహిళల సింగిల్స్లో చైనీస్ తైపీ షట్లర్ పై యు పొతో జరిగిన మ్యాచ్లో ఆకర్షి కశ్యప్ 16-21, 11-21తో వరుసగా రెండు గేముల్లో పరాజయాన్ని చవిచూసింది.
పురుషుల విభాగంలో స్టార్ ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్ ప్రణయ్ సింగిల్స్ దారుణంగా విఫలమయ్యారు. ప్రత్యర్థి చేతుల్లో చిత్తుగా ఓడారు. డెన్మార్క్ టాప్ సీడ్ వికటర్ అక్సెల్సన్తో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ 33 నిమిషాల్లోనే ఓటమిని అంగీకరించాడు. 9-21, 9-21తో వరుసగా రెండు గేమ్స్లో ఓడిపోయాడు. ఏ దశలోనూ ప్రత్యర్థిపై పైచేయి సాధించలేదు.
చైనీస్ తైపీ షట్లర్ లీ యాంగ్తో జరిగిన పోరులో ప్రణయ్ 21-14, 13-21, 13-21తో మ్యాచ్ను చేజార్చుకున్నాడు. తొలి గేమ్లో సత్తాచాటిన ప్రణయ్ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు. అలాగే ఉమెన్స్ డబుల్స్లో ట్రీసా జాలీ- గాయత్రి పుల్లెల జోడీ ఓటమిపాలయ్యారు. ఇండోనేషియా జంట అప్రియాని రహాను- సిటీ ఫాడియా సిల్వ రమధంతితో జరిగిన మ్యాచ్లో 18-21, 12-21తో పరజాయాన్ని చవిచూశారు. తొలి గేమ్లో పోరాడిన ట్రిసా-గాయత్రి ద్వయం రెండో గేమ్లో ప్రతిఘటించలేకపోయింది.