
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్ నుంచి తప్పుకున్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్పై, ఇతర అంతర్జాతీయ టోర్నీల మీద మరింత దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నాడు.
పీబీఎల్ లీగ్లో బెంగళూరు రాప్టర్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 26 ఏండ్ల శ్రీకాంత్.. గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిరాశ పరుస్తున్నాడు. 'అంతర్జాతీయ టోర్నీలపై దృష్టిపెట్టేందుకు పీబీఎల్ ఐదో సీజన్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. బెంగళూరు రాప్టర్స్కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది. ఈ ఏడాది రాప్టర్స్ చక్కటి ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నా' అని శ్రీకాంత్ ట్వీట్ చేశాడు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పీబీఎల్ లీగ్ జరగనుంది.
గత ఏడాది కాలంగా పేలవమైన ఫామ్తో నిరాశ పరుస్తున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా పీబీఎల్ ఐదో సీజన్ నుంచి వైదొలిగింది. వచ్చే ఏడాది బీడబ్ల్యూఎఫ్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని సైనా ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
'పీబీఎల్ ఐదో సీజన్ ఆడటం లేదు. గాయాలు, అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది నేను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయా. అందుకే పీబీఎల్ సీజన్ సమయాన్ని నా ఆట మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు వెచ్చించాలని నిర్ణయించుకున్నా. తర్వాతి సీజన్లో ఆడేందుకు ప్రయత్నిస్తా' అని సైనా ఆదివారం ట్వీట్ చేసింది. గత సీజన్లో నార్త్ ఈస్టెన్ వారియర్స్ తరఫున ఆడిన సైనా.. ఈసారి పీబీఎల్ వేలంలో పాల్గొనడం లేదు.