హైదరాబాద్: స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ను సాధించిన భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్కు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా సోమవారం రూ. 5 లక్షల అవార్డుని ప్రకటించారు. అనంతరం అఖిలేష్ దాస్ గుప్తా మాట్లాడుతూ "శ్రీకాంత్ స్విస్ ఓపెన్లో ఎంతో అధ్బుతంగా ఆడారు. అంతర్జాతీయ వేదికలపై రాణిస్తూ దేశానికి పేరు తెస్తున్న ఆటగాళ్లను సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది" అని అన్నారు.
ప్రపంచంలో 4వ ర్యాంకులో ఉన్న కిదాంబి శ్రీకాంత్కు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ మాట్లాడుతూ 'స్విట్జర్లాండ్లో బసేల్లో జరిగిన బ్యాడ్మింటన్ పోరులో విజయం సాధించిన శ్రీకాంత్కు నా అభినందనలు. ఈ టైటిల్ను సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డును సృష్టించావు. నీవు సాధించిన ఈ విజయాన్ని దేశం మొత్తం పండుగ చేసుకుంటుంది. నీవు భవిష్యత్లో మరిన్ని రికార్డ్సు సాధించి భారత్కు పేరును తేవాలని ఆకాంక్షిస్తున్నానని' అని పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటే బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) మంగళవారం బాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్లకు నగదు పురస్కారాలను ప్రకటించింది. అంతర్జాతీయ వేదికల్లో అత్యధిక ప్రతిభ కనబర్చిన ప్రపంచంలో రెండో ర్యాంకులో ఉన్న సైనానెహ్వాల్, కామన్ వెల్త్ గేమ్స్లో ఛాంపియన్గా నిలిచిన కశ్యప్ ఇద్దరికీ చెరి ఐదు లక్షల రూపాయల బహుమతిని ప్రకటిస్తున్నట్లు అధ్యక్షులు అఖిలేష్ దాస్ ప్రకటించారు.
గత జనవరిలో లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలసిందే.